పసి పిల్లలకు మంచి నీళ్లు ఎప్పుడు తాగించాలి?
ఆర్.బి.ఎం డెస్క్: పిల్లలు పుట్టగానే తల్లి పాలు తాగడం సహజం. కొంత మంది తల్లులకి కొన్ని కారణాల వల్ల పాలు తక్కువగా ఉండడం లేదా పాలు రాకపోవడం వంటివి జరుగుతాయి, అలాంటి వారు తమ పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తుంటారు. తల్లి పాలు లేదా డబ్బా పాలు పిల్లలకు తప్పకుండా కొన్ని నెలల వరకు త్రాగించాలి. పిల్లలకి మూడు నాలుగు నెలలు నిండిన తర్వాత అప్పుడప్పుడు మంచినీరు త్రాగిస్తుండాలి అని చాలా మంది తల్లులు నమ్ముతారు కానీ పిల్లలకు ఆరు నెలలు నిండేతవరకు తల్లిపాలు లేదా డబ్బా పాలు తప్ప ఇంకేమి ఇవ్వకూడదు, ఒకవేళ అవసరం ఉంటే వైద్యుల సలహా మేరకు ఇవ్వవచ్చు . పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు సరిపోతాయి, ఆరు నెలలు నిండిన తరువాత తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడం ప్రారంభిస్తే మంచిది. ఆరు నెలల తరువాత ఆహారంతో పాటు మంచినీరు త్రాగించాలి.
తల్లిపాలు పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం, ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పసి పిల్లలకి సుమారు ఒక సంవత్సరం పాటు తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం అని వైద్యులు పలు సర్వే ల ద్వారా వెల్లడించారు. రొమ్ము పాలు ఇవ్వడం వలన పిల్లలకే కాకుండా తల్లికి కూడా ఆరోగ్యకరం, డయాబెటిస్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలను దరిచేరకుండా సహాయపడుతుంది.
పసిపిల్లలు పుట్టినప్పటి నుండి కొంచెం పెద్దగా అయ్యే వరకు ఎన్నో అపోహలు వస్తుంటాయి, వాటిని నమ్మి కొంతమంది తల్లులు పాటిస్తారు. పసిపిల్లలు ఉన్న తల్లులు అపోహలను నమ్మడం మానేసి వాస్తవాలను తెలుసుకొని నడుచుకుంటే తమ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.