చినజీయర్ స్వామిపై సీతక్క ఫైర్..
ఆర్.బి.ఎం హైదరాబాద్: చినజీయర్ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. సమక్క-సారలమ్మలపై చినజీయర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చినజీయర్ వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నజీయర్ వ్యాఖ్యలపై సీతక్క తీవ్రంగా స్పందించారు. సమ్మక్క సారలమ్మపై అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజమెత్తారు. సమ్మక్క సారలమ్మలు తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలని గుర్తుచేశారు.
120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడటానికి 150 రూపాయలు టికెట్ ధర పెట్టారని విమర్శించారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని తెలిపారు. ‘‘మా తల్లులది వ్యాపారమా?… మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా?’’ అని ప్రశ్నించారు. చినజీయర్ రియల్ ఎస్టేట్ స్వామి అయ్యారని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని సీతక్క పిలుపునిచ్చారు. చినజీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీతక్క డిమాండ్ చేశారు.