కరీంనగర్లో బీజేపీకి షాక్!
ఆర్.బి.ఎం హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో బీజేపీకి గులాబీ పార్టీ షాకివ్వబోతోంది. బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరనున్నారు. వీరితో పాటుగా మరో పదిమంది బీజేపీ కార్పొరేటర్లను గులాబీ దళంలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ.. అందులో కరీంనగర్ జిల్లా బీజేపీ కంచుకోటగా ఉంది.
కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచి ఉమ్మడి జిల్లాలో సత్తాచాటారు. కాషాయపార్టీకి బలమైన పునాదులున్న ఉమ్మడి కరీంనగర్లోనే ఆ పార్టీని దెబ్బతీసేందుకు గులాబీ శ్రేణులు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ పదేపదే చెబుతుంటారు. అలాంటిది కరీంనగర్ నుంచే వలసలను అధికారపార్టీ ప్రొత్తహించడం చర్చనీయాంశమైంది. అటు టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకోవడానికి కాషాయ పార్టీ ఇటు బీజేపీ శ్రేణులను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.