‘కమలం’ గుప్పిట్లో భాగ్యనగరం..
ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్పన సభ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయ సంకల్ప సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈ మైదానంలో 19లక్షల చదరపు అడుగుల మేర సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలిలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూర్చునేందుకు షెడ్లు/టెంట్లు నిర్మిస్తున్నారు. ఇందులో వీఐపీల కోసం 7 షెడ్లు నిర్మించారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, మాజీ మంత్రులు హాజరుకానుండటంతో వేర్వేరుగా మూడు వేదికలను ఏర్పాటు చేశారు.
ఈ మూడు వేదికల్లో ప్రధాని మోదీ ఆసీనులయ్యే వేదిక మధ్యలో ఉంటుంది. ఒక వేదికపై అమిత్ షా, గడ్కరీ, కిషన్ రెడ్డి, జేపీ నడ్డా, రాష్ట్ర నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ కూర్చుంటారు. మరో వేదికపై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు కూర్చుంటారు. ఇంకో వేదికపై కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు కూర్చుంటారు. వర్షం పడ్డా సభకు హాజరయ్యే జనం తడవకుండా ఉండేందుకు జర్మన్ హ్యాంగర్ టెంట్లు వేశారు. సభను వీక్షించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నివైపులా 30 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా వినిపించేలా 500వాట్స్ ఫ్లూయింగ్ సౌండ్ సిస్టమ్తో కూడిన బాక్సులు ఏర్పాటు చేశారు. 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కూర్చునే వేదికను ఎస్పీజీ అధికారులు పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు