ఇక మీ ఆటలు సాగవు.. మోదీని సూటిగా ప్రశ్నించిన కేసీఆర్..
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. అందుకు తగ్గట్టే ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా , హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మోదీకి కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ముందు ఇక మీ ఆటలు సాగవని హెచ్చరించారు. మోదీ కంటే ముందు చాలా మంది ప్రధానులు పనిచేశారని, ఎవరు శాశ్వతం కాదని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా పూర్తి చేశారా? అని సీఎం ప్రశ్నించారు. దేశంలో రైతుల భాగస్వామ్యం చాలా పెద్దదని చెప్పారు. వారి ఆదాయం డబుల్ చేస్తాం అన్నారని, ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఖర్చు మాత్రం డబల్ అయిందన్నారు. ఢిల్లీ ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు మేము సహాయం చేస్తే కూడా అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. దేశ రైతులు బంగారం అడగడం లేదని, మద్దతు ధర అడుగుతున్నారని కేసీఆర్ తెలిపారు.