హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భయపెడుతున్న స్వతంత్ర అభ్యర్థులు.. కారణం అదేనట?
ఆర్.బి.ఎం హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆరెస్ ను ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు భయపెడుతున్నారు. హుజురాబాద్లో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో ఇద్దరు అభ్యర్థులకు రోడ్డ రోలర్, చపాతీ రోలర్ గుర్తులను ఇచ్చారు. ఈ రెండు గుర్తులను చూసి టీఆర్ఎస్ వణికిపోతున్నారని చెబుతున్నారు.
ఎందుకంటే రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఈ గుర్తుల వల్ల ఓడిపోయామని ఆ పార్టీ నేతలు గుండెలు బాదకుంటున్నారు. గత పార్లమెంట్ భువనగిరి లోక్సభ నుంచి టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో నర్సయ్య గౌడ్పై వెంకటరెడ్డి 5వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును రోడ్డు రోటర్ పోలి ఉండడంతో ఓటర్లు రోడ్డు రోలర్ గుర్తుకు ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్డు రోలర్ గుర్తుకు ఆ ఎన్నికల్లో 27 వేల ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి వల్లే ఓడిపోయామని టీఆర్ఎస్ ఇప్పటికీ చెబుతుంటారు.
ఇక ఇలాంటి పరిస్థితి దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఎదురైంది. ఈ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తును ఇచ్చారు. ఇక్కడ కూడా ఓటర్లు గందరగోళంలో కారు గుర్తుకు బదులు చపాతీ రోలర్కు ఓట్లు వేశారని టీఆర్ఎస్ చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఓడి పోయారు. చపాతీ రోలర్ గుర్తు అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి రోడ్డు రోలర్, చపాతీ రోలర్ కారణమయ్యాయని టీఆర్ఎస్ శ్రేణులు వాపోయారు. ఇప్పుడు హుజురాబాద్లో కూడా స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరికి రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను కేటాయించారు. తిరిగి ఇవే గుర్తులు రావడంలో టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.