ఈటల కుటుంబానికి హైకోర్టులో ఊరట
ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి హైకోర్లులో ఊరట లభించింది. జమునా హేచరీస్ భూవివాదానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మాసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామంలోని సర్వే నంబరు 130లో జమునా హేచరీస్కు ఉన్న మూడు ఎకరాల భూమి విషయంలో ఆగస్టు 1 వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల జమునా హేచరీస్ భూములు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెదక్ కలెక్టర్ మాసాయిపేట తహసీల్దార్ ఆదేశాలు జారీచేశారు.
ఈ మూడెకరాలు ప్రభుత్వ భూములని, వాటిని ఆక్రమించడంపై వివరణ ఇవ్వాలంటూ గత నెల 25న మాసాయిపేట తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ జమునా హేచరీస్, ఆ సంస్థ డైరెక్టర్ ఈటల నితిన్రెడ్డి, ఈటల జమున దాఖలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు జస్టిస్ ఎం.సుధీర్కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 1 వరకు ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.