పరవళ్లు తొక్కుతున్న కుంటాల
ఆదిలాబాద్: రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం జలకళ సంతరించుకుంది. ఆది, సోమవారాలు ఎగువన కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి వరద నీరు కుంటాల జలపాతంలోకి చేరింది. దీంతో జలపాతం నిండు కుండలా మారింది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో రాతి బండలపై పారే జలధారను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలొస్తున్నారు. నిర్మల్ జిల్లాలోనూ సోమవారం వర్షం పడింది. అత్యధికంగా పెంబి మండలంలో 59.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టుకు 30508 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 682 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి.