గ్రామస్తుడిని తన్నిన దామస్తాపూర్ సర్పంచ్ అరెస్టు… సస్పెన్షన్కు రంగం సిద్ధం
ఆర్.బి.ఎం వికారాబాద్: గ్రామంలో మంచినీరు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని కోరిన గ్రామస్తుడిపై విరుచుకుపడి బూటుకాలితో ఎగిరెగిరి తన్నిన సర్పంచ్ను బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తాపూర్లో ఓ గొడవపై పంచాయితీ నిర్వహించేందుకు సర్పంచ్ జైపాల్రెడ్డి సమావేశమయ్యాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ గ్రామంలో తాగునీరు, పారిశుధ్య సమస్యలున్నాయని, పరిష్కరించాలని సర్పంచ్ను కోరాడు. ‘అవన్నీ నీకెందుకు రా..’ అంటూ జైపాల్రెడ్డి.. శ్రీనివాస్ను కాలితో ఎగిరెగిరి తన్నాడు. తనపై దాడి చేసిన సర్పంచ్ జైపాల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ జైపాల్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. జైపాల్రెడ్డిని సస్పెండ్ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.