లోక కళ్యాణం…సీతారామ కళ్యాణం:చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

లోక కళ్యాణం…సీతారామ కళ్యాణం:చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం: సీతారామ కళ్యాణం లోక కళ్యాణమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆలయం ప్రారంబోత్సవం సందర్భంగా వైభవోపేతంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపంలో సిరి కళ్యాణపు బొట్టును బెట్టి, మణిబాసికం, బుగ్గనచుక్క, పాదాలకు పారాణితో వరుణుడిగా రామయ్య, సొంపుగా కస్తూరి నామం, కనకాంబరాలు, మల్లెలుతో ఇంపైన పూలజడ , చంపక వాకీ చుక్కతో పెళ్లికుమార్తెగా సీతమ్మ కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వివాహ మహోత్సవాన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన వారితో చెర్లోపల్లె భక్త జనసంద్రమైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో, అత్యంత వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం జరగడం అభినందనీయమన్నారు. చెర్లోపల్లె ప్రజలు, భక్తులు ,దాతలు సమిష్టిగా సీతారామ ఆలయాన్ని సుందరంగా నిర్మింపచేసి, వైభవంగా ఆలయం ప్రారంభం, కళ్యాణం జరపడం గొప్పవిషయమన్నారు. ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ పూజారులు చీఫ్ విప్ కు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి, వైస్ ఎం పి పి గంగిరెడ్డి,మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, సర్పంచ్ రఘునాథ, రాజారెడ్డి,ఎం పి టి సి ప్రభాకర్ రెడ్డి, టీచర్ వెంకట శివారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సాయి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ఈశ్వరయ్య, హనుమంతురెడ్డి , ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.