అమరావతి: సీఎం జగన్ను నమ్మి నటుడు మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, ఆలీ వైసీపీలో చేరారు. ప్రభుత్వ అండ చూసుకుని అందరిని చెడామడా తిట్టేశారు. అప్పుడో ఇప్పుడో పదవులు ఇస్తామని ఊరించి నట్టేట ముంచేశారు. ఇటు సినిమాల్లో అవకాశాలు లేక అటు ప్రభుత్వం ఏ పదవి ఇవ్వక పోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. గతంలో ఆలీని మైనార్టీ కోటాలో రాజ్యసభకు పోసానికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ప్రచారం చేశారు. చివరకు ఆ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. జగన్ ఏడాదిన్నర మాత్రమే అధికారంలో ఉంటారు. గత ఎన్నికలకు పోసాని, అలీ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదిగో ఇదిగో పదవులిస్తామని ఊరించారు. వారందరికీ ఇప్పుడు తత్వం బోధపడింది. ఎవరికీ పదవులు ఇవ్వలేదు. ఫృధ్వీకి పదవి ఇచ్చినట్లు ఇచ్చి ఇట్లే లాగేసుకున్నారు. ప్రాణ స్నేహితుడిని కాదని జగన్తో ఆలీ నడిచారు. ఇదిగో పదవి అదిగో పదవి అని ఆలీకి ఆశపెట్టారు.
ఇక పోసాని పరిస్థితి కూడా ఇలాగే ఉందని అంటున్నారు. జగన్ కోసం మెగా ఫ్యామిలీని పోసాని బండ బూతులు తిట్టారు. ఆ ఫలితం ఆయనకు ఇప్పుడు ఎదురవుతోంది. పోసానికి సినిమా చాన్సులు తగ్గిపోయాయి. ఆ మధ్య నిరాశతో ఉన్న ఆయనను జగన్ పిలిపించుకుని మాట్లాడారు. మాటలే తప్ప పదవి రాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ సలహాదారు పదవి, మరొకరిని కార్పోరేషన్ చైర్మన్ను చేస్తారని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతాయి. పదవి కాలం ఉంటే గింటే మరో ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది. ఈ స్వల్పకాలంలో పదవిలో ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. వీళ్లకు కేటాయించిన శాఖల్లో అవకతవకలు జరిగితే వీళ్ల మెడకే చుట్టుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం మారితే పోసాని లాంటి వాళ్లను వచ్చే ప్రభుత్వం వదిలేప్రసక్తే లేదు. పుణ్యకాలమంతా ముగిసిపోవడంతో వైసీపీపై సినిమా వాళ్లకు ఆగ్రహం పెరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో వీళ్లంతా వైసీపీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. జగన్ ను నమ్ముకుని మోసపోయామనే భావనలో నటులున్నట్లు చెబుతున్నారు. పృథ్వీ రోజుకు లక్షల్లో తీసుకునేవారు. వైసీపీ అండతో అందరిని నానా రకాలుగా దుర్భాషలాడటంతో అతడికి అవకాశాలు రాకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైసీపీకి దండంపెట్టి జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. మిగతా నటులకు అవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ను నమ్ముకున్న నట్టేట మునిగామని నటులు వాపోతున్నారు. ప్రభుత్వం కోసం పనిచేసిన వారి కోసం ఏవో పదవులు ఇస్తే సరిపోయేది. కానీ జగన్ మొండిగా వ్యవహరించడంతోనే చిక్కులు ఎదుర్కొంటారని అంటున్నారు.