ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బాలకృష్ణ
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీసత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. లోకసభ స్థానాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హిందూపురం లోకసభ స్థానం పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలను అలాగే రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న 6 నియోజకవర్గాలతో కలిపి పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంతో కలిపి 8 నియోజకవర్గాలు, 34 మండలాలుగా కొనసాగించనున్నారు.