తెలంగాణ సాయుధపోరాటాన్ని నడపించిన వారిలో ప్రముఖుడు రావినారాయణరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పెత్తందారీ వ్యవస్థపై పిడికిలి బిగించారు. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస వరకూ ఆచరించిన మహనీయుడు రావినారాయణరెడ్డి. రావినారాయణరెడ్డి గొప్ప సంఘ సంష్కర్త. రావి నారాయణరెడ్డి 1908, జూన్ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. ఆయన విద్యాబ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది. హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ మిడిల్ స్కూల్లో ఫస్ట్ఫారం పూర్తి చేశారు. చాదర్ఘాట్ హైస్కూల్లో ఎస్.ఎల్సీ వరకు చదివారు. నిజాం కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్లో చదువుతున్న కాలంలోనే ఆయనపై జాతీయోద్యమ ప్రభావం పడింది. 1940లో హైదరాబాద్లో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు స్వాతంత్ర్య సమరయోధురాలు పద్మజానాయుడు నాయకత్వంలోని ప్లేగు నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1930లో కాకినాడ వెళ్లి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీజీ పిలుపుతో తన స్వగ్రామం బొల్లేపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు.
1934లో గాంధీజీని హైదరాబాద్కు రావినారాయణరెడ్డి ఆహ్వానించారు. తన భార్య సీతాదేవి ఒంటిపై ఉన్న నగలన్నీ అమ్మారు. ఆ సొమ్మును ‘‘స్వరాజ్య నిధికి’’ విరాళంగా ఇచ్చిన దాత రావినారాయణరెడ్డి. నారాయణరెడ్డి ఎన్నో పదవులను అలంకరించారు. ఆ పదవులకు ఆయన వన్నె తెచ్చారు. మూడుసార్లు ‘ఆంధ్ర మహాసభ’ అధ్యక్షుడిగా పనిచేశారు. సోషలిస్టు రష్యా ప్రగతికి ముగ్ధుడై, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాడు రావినారాయరెడ్డి. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. ః
భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన తనకు వారసత్వంగా వచ్చిన 700ఎకరాల్లో 500ఎకరాలను పేదలకు పంచారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ విజయం సాధించిన చరిత్ర సృష్టించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి నుుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితాన్ని గడిపారు. అసెంబ్లీకి రోజూ రిక్షాలో వెళ్లేవారు. ఈయన ఖ్యాతిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణరెడ్డి సేవలు ఈ నేలపై అజరామరంగా నిలిచాయి. నిస్వార్థజీవి అయిన రావినారాయణరెడ్డి భావితరాలకు ఆదర్శనీయం.