రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. కర్నూలులో మానవ హక్కుల కమిషన్ , లోకాయుక్త లను ఏర్పాటుచేస్తుండడం హర్షణీయ మన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, పోతిరెడ్డిపాడు విస్తరణ, హంద్రీ నీవా తదితర అభివృద్ధి పనులకు బాటలు వేశారన్నారు. వారి తనయుడు సీఎం జగన్ గతంలో కోల్పోయిన రాజధాని స్థానంలో న్యాయ రాజధానిగా కర్నూలును అభివృద్ధిచేయడంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గాలేరు- నగరి, హంద్రీనీవా ల అనుసంధానం, స్టీల్ ప్లాంట్ కు దారిచూపడం, కొప్పర్తిని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడం చూస్తుంటే తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ పేరొందుతున్నారు. రాయలసీమ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారన్నారు. రాయలసీమను న్యాయరాజధానిగా చేసినప్పుడు కొంతమంది కుట్రదారులు , రాయలసీమ గడ్డపైనే పుట్టిన ప్రతిపక్షనేత ఈ అంశాన్ని వ్యతిరేకించి తనకున్న వ్యవస్థలను వాడుకుని కోర్టులలో స్టేలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబేనన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. న్యాయరాజధానిని త్వరలో కర్నూలులో ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల కోరికను సీఎం జగన్ నెరవేర్చనున్నారన్నారు. మానవ హక్కుల కమీషన్, లోకాయుక్త లను కర్నూలులో ఏర్పాటు చేస్తుండడంపట్ల సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నామన్నారు.సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధతలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.