మోదీకి జగన్ విజ్ఞాపన పత్రం
అమరావతి: గన్నవరంలో ప్రధాని మోదీకి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మోదీకి జగన్ విజ్ఞాపన పత్రం అందజేశారు. రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదని జగన్ పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు.