అచ్చెన్నకు అవమానం
భీమవరం: భీమవరంలో సోమవారం జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు అవమానం జరిగింది. ఆదివారం వరకూ ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనేవారి ప్రొటోకాల్ లిస్టులో ఆయన పేరు ఉంది. సభలో పాల్గొనేందుకు సోమవారం అచ్చెన్నాయుడు భీమవరం వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక ఆయన పేరు మాయమైంది. దీంతో ప్రధానిని హెలీప్యాడ్ వద్ద ఆహ్వానించేందుకు వెళ్లాల్సిన ఆయన హోటల్ రూమ్లోనే ఆగిపోయారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అచ్చెన్నకు ఫోన్ చేసి హెలీప్యాడ్ వద్దకు రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ప్రొటోకాల్లో తన పేరు లేదంటూ కలెక్టర్ చెప్పారన్న విషయాన్ని కిషన్రెడ్డికి తెలిపారు. దీనిపై కిషన్రెడ్డి జిల్లా అధికారులతో సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, టీడీపీ నాయకులతో కలిసి అల్లూరి విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించి అచ్చెన్న వెనుదిరిగారు.