విజయవాడ: నటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీ లక్ష్మికి ప్రతి నెల రూ. 8లక్షలు భరణం ఇవ్వాలని విజయవాడ 14వ అదనపు (జిల్లా ఫ్యామిలీ కోర్టు) కోర్టు తీర్పునిచ్చింది. శ్రీలక్ష్మిని పృథ్వీరాజ్ 1984లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్ విజయవాడలో మా పుట్టింట్లో ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించాడని, ఆ ఖర్చులన్నీ మా తల్లిదండ్రులే భరించారని, తనను తరుచు వేధించేవాడని పోలీసులకు శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. తన భర్త నెలకు సినిమాలు, సీరియళ్ల ద్వారా రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారని, అందువల్ల తనకు భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో శ్రీలక్ష్మి కేసు దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం శ్రీలక్ష్మికి పృథ్వీరాజ్ నెలకు రూ. 8లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తాన్ని ప్రతి నెల 10వ తేదీ నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
పృథ్వీరాజ్ వేరే అమ్మాయిలతో ఎఫైర్లు ఉన్నాయని శ్రీలక్ష్మీ ఆరోపించింది. ఈ క్రమంలోనే గతేడాది భార్యను తన ఇంట్లో నుంచి పృథ్వీరాజ్ గెంటేశాడు. ఆమె న్యాయం చేయాలంటూ గత నవంబరులో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ చెన్నైకు చెందిన ఓ అమ్మాయితో సహజీవనంలో ఉన్నాడనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆమె పృథ్వీరాజ్ ఆఫీస్లో రిసెప్షనిస్టుగా పని చేసినట్లు చెబుతున్నారు. ఈయన కోసం ఆమె తన భర్తకు కూడా విడాకులు ఇచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.