టీఆర్ఎస్ నేతల వేధింపులు?… రూటు మార్చిన షర్మిల
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నిరుద్యోగ దీక్షలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రూట్ మార్చారు. ఈ రోజు నుంచి యూనివర్సిటిల ముందు దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి మంగళవారం యూనివర్సిటి ముందు ఆందోళనలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్టీపీ నిర్ణయానికి ఓ కారణం ఉంది. అదేమంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుదోగ్యుల కుటుంబాలను కలిసి పరామర్శించి.. వారి నివాసం వద్ద నిరుద్యోగ దీక్షలు చేయాలని భావించారు. ఇందుకోసం ప్రణాళికలను కూడా రూపొందించారు. మొత్తం 167 మంది కుటుంబాలను పరామర్శించాలని షర్మిల సంకల్పంచారు.
అయితే ఆమె సంకల్పానికి అవాంతరాలు ఎదురువుతున్నాయి. ఇప్పటివరకు 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. 8 చోట్ల నిరుద్యోగ ఉద్యోగ దీక్షలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు దీక్షలపై విముఖత వ్యక్తమవుతోంది. రెండు చోట్ల కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ నిరుద్యోగి నరేష్ తండ్రి విజ్ఞప్తి చేశారు. దీంతో దండేపల్లి మండలం కేంద్రంలో దీక్ష చేశారు.
ఈ మంగళవారం భూపాలపల్లి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించాలని షర్మిల అనుకున్నారు. ఆ కుటుంబం నుంచి కూడా షర్మిల టీంకు విముఖత వ్యక్తమయింది. తాము ఇప్పుడు బాగానే ఉన్నామని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆ కుటుంబసభ్యులు షర్మిలకు చెప్పారు. దీంతో ఇక నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో నిర్మించిన పాలమూరు యూనివర్సిటి నుంచే తన పోరాటాన్ని షర్మిల ప్రారంభిస్తున్నారు.
అయితే తాము ఎంచుకున్న ఉద్యోగ పోరాటంలో అడుగడుగున అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని వైఎస్ఆర్టీపీ నేతలు చెబుతున్నారు. నిరుద్యోగ కుటుంబాలు షర్మిల రాకను ఆహ్వానిస్తున్నా స్థానిక ఎమ్మెల్యేలు ఆ కుటుంబాలను భయపెడుతున్నరని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగ కుటుంబాలను ఇబ్బందులు పెట్టకూడదనే ఉద్దేశంతోనే.. తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పోరాటాన్ని మరో రూపంలో చేస్తున్నట్లు షర్మిల టీం ప్రకటించింది.