టీఆర్ఎస్లో అన్యాయం… ఎమ్మెల్యే ఎదుటే కంటతడి పెట్టుకున్న కీలక నేత?
ఆర్.బి.ఎం హైదరాబాద్: టీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్లో అంసతృప్తులు రాజుకుంటున్నాయి. ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష పదవి నియామకంలో సీనియర్లకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ను నిలదీశారు. కొత్త కమిటీని రద్దు చేయాలని, లేకుంటే కమిటీనే బహిష్కరిస్తామని ముఠా గోపాల్ను స్థానిక నేతలు హెచ్చరించారు. నిన్న బాపూజీనగర్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ముషిరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు భిక్షపతియాదవ్, అధ్యక్ష పదవి ఆశించిన లక్ష్మణ్గౌడ్, శ్రీధర్రెడ్డి నిరసన తెలిపారు.
తాము తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో పనిచేస్తున్నామని, డివిజన్ నాయకులతో చర్చించకుండా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ముషీరాబాద్ డివిజన్ నూతన అధ్యక్షుడిగా నర్సింగ్ప్రసాద్ను ఎలా ప్రకటిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇస్తేనే బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారని, బీజేపీ డివిజన్ మాజీ అధ్యక్షుడు దీన్దయాల్రెడ్డికి అధ్యక్ష పదవి కేటాయించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. దీన్దయాల్రెడ్డిని ఓదార్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఎమ్మెల్యే దీన్దయాల్రెడ్డి ఇంటికి వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదని చెబుతున్నారు.