పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
ఆర్.బి.ఎం హైదరాబాద్: పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. చార్మినార్ వద్ద టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు.
హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీసీపీ చైతన్య పోలీస్ భద్రత పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే రాజసింగ్ పిలుపునిచ్చారు. యోగి రాక కోసం పాతబస్తీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజాసింగ్ తెలిపారు.