నగ్నంగా దుప్పట్లో చుట్టి రహస్యంగా తరలిస్తున్న ఆ ఇద్దరు యువకులను..
ఆర్.బి.ఎం హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటన మరువకముందే మరో ఘటన భాగ్యనగరంలో వెలుగుచూసింది. యువతి మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటన నగర శివారులోని హయత్నగర్ బాతుల చెరువు సమీపంలో వెలుగుచూసింది. అనుమానంతో యువకులను ప్రశ్నించారు. ఆ ఇద్దరూ పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి ఇద్దరి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చనిపోయిన యువతి తన భార్య అని ఆ ఇద్దరిలో ఓ యువకుడు వినోద్ పోలీసులకు తెలిపాడు. తన భార్యకు 20 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోందని, రాత్రి మృతి చెందిందని చెప్పాడు. అంత్యక్రియలు చేసేందుకు తనకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో బయటికి తీసుకెళ్లి ఖననం చేయాలని వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే మహిళను నగ్నంగా తరలించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరిని వేరువేరుగా పోలీసుల ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో హయత్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో అసలు రహస్యం బయటపడే అవకాశం ఉంది. స్థానికులు మాత్రం ఇది హత్య అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.