పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా కేసీఆర్ లక్ష రూపాయలు అప్పుచేశారు: బండి సంజయ్
ఆర్.బి.ఎం రంగారెడ్డి : సీఎం కేసీఆర్ను నమ్మొద్దని, నమ్మించి మోసం చేసి గొంతు కోస్తాడని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా కేసీఆర్ లక్ష రూపాయలు అప్పుచేశాడని ఆరోపించారు. తరతరాలకు సరిపోయే ఆస్తులు సంపాదించాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కేసీఆర్ను కలవడానికి వెళితే.. జైల్లో వేస్తారని, పేదల కోసం కొట్లాడితే తనను కూడా జైల్లో పెట్టించారని ఆరోపించారు. రైతు బీమా విషయంలో ప్రశ్నించిన పాపానికి తనను కేసీఆర్ చనిపోమనడం దారుణమన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.