నా హత్యకు భారీ కుట్ర : తీన్మార్ మల్లన్న..
ఆర్.బి.ఎం ఘట్కేసర్: అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజు జైలులో తనను హత్య చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అధికార పార్టీ తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఎక్కడా లేని విధంగా కేసులుపెట్టి 74 రోజులు జైలుకు పంపిందని తెలిపారు. జైలులో అతిక్రూరమైన పాత నేరస్థులచే తనను చంపాలని కుట్రపన్నారని.. అయితే చాకచక్యంగా తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు చీకటి గదిలో బందించి ఎర్రగడ్డలోని మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని యత్నించినట్లు ఆరోపించారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నూతన పార్టీ పెట్టడం, ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం, పాత పద్దతిలోనే కొనసాగడం, ఇతర పార్టీలో చేరడం వంటి నాలుగు అంశాలపై జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయాలని మల్లన్న తీసుకున్నారు. తాను జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన వారందరికీ, తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు మల్లన్న ధన్యావాదాలు తెలిపారు.