రాజు ఆత్మహత్యపై విచారణకు హైకోర్టు ఆదేశం
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజు ఆత్మహత్యపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని పౌరహక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తప్పుబట్టారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు రాజు ఆత్మహత్యపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది. వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను జ్యూడీషియల్ అధికారిగా హైకోర్టు నియమించింది. నాలుగు వారాల్లో సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
తన భర్తను పోలీసులే చంపారని చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు భార్య మౌనిక ఆరోపించారు. తన కొడుకును పోలీసులే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని రాజు తల్లి వాపోయారు. తాను, తన కోడలు, మనుమరాలు అనాథలమయ్యామని ఆమె తెలిపింది.