రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పరిగి ఎస్ఐ క్రాంతికుమార్
ఆర్.బి.ఎం పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి ఎస్ఐ ఓ కేసులో రూ.10 వేలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామానికి చెందిన బి.సాయిరెడ్డి, అదే గ్రామానికి చెందిన ఎం.సురేష్ల మధ్య గత నెల 6న స్థానిక శివాలయం దగ్గర గొడవ జరిగింది. ఈ విషయంపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. సురేష్ సాయిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ నెల 22న ఇరువురిని గ్రామ పెద్దలు పిలిపించి రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో ఎస్ఐ క్రాంతికుమార్.. కేసు రాజీ చేసుకుంటే సరిపోతదా? అంటూ రూ.15 వేలు ఇవ్వాలని సాయిరెడ్డి బాబాయి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బి.పరుశరాంరెడ్డిని అడిగాడు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు పరుశరాంరెడ్డి ఒప్పుకున్నాడు. గురువారం రాత్రి పరిగిలోని స్వాగత్ హోటల్ దగ్గర ఎస్ఐకి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నామని ఏసీబీ డియస్పీ సూర్యనారాయణ విలేఖరులకు తెలిపారు. ఎస్ఐని రిమాండ్కు తరిలిస్తున్నట్లు ఆయన తెలిపారు.