పోలీసులే చంపారు.. బాధిత కుటుంబానికి చేసిన న్యాయం మాకు చేయాలి.. ఆలా చేయకపోతే.. : సింగరేణి నిందితుడి భార్య మౌనిక
ఆర్.బి.ఎం నల్గొండ: తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని సైదాబాద్ చిన్నారి హత్యచార కేసు నిందితుడు రాజు భార్య మౌనిక వాపోయింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడని పోలీసులు తన భర్తను చంపారని.. దీంతో తాము అనాథలమయ్యామని ఆమె బోరున విలపించింది. తమ కుటుంబానికి మగ దిక్కు లేకుండా పోయిందని.. నేనూ, మా అత్త, 11 నెలల కుమార్తె ఎలా బతకాలని వాపోయింది. తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాకుండా పోలీసులు అడ్డుకున్నారని, గతంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇలానే చేశారా? అని ఆమె ప్రశ్నించారు. తన భర్తకు అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉందని, ఇతర ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. భర్తను పోలీసులే చంపి, గంజాయి తాగేవాడని, ఇతర పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె ఆరోపించింది. తన భర్తను చంపి బాధిత కుటుంబానికి న్యాయం చేసినట్టుగానే తమ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని మౌనిక అభ్యర్థించింది.