హుజురాబాద్లో పోటీకి కొండా సురేఖ సన్నద్ధం… కానీ
ఆర్.బి.ఎం వరంగల్: హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కొండా సురేఖ సముఖత వ్యక్తం చేసింది. అయితే ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీచేయాలని తమ పార్టీ నేతలు కోరుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ హుజురాబాద్లో పోటీ చేసినా మళ్లీ వరంగల్కే తిరిగి వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్లో పోటీచేస్తానని కొండా సురేఖ నిబంధన విధించారు.
అయితే సురేఖ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ మంత్రం జపిస్తున్నారు. బీజేపీ ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఇద్దరూ బీసీ సమాజికవర్గానికి చెందిన వారే. కాంగ్రెస్ కూడా బీసీ సమాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపులూ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సమాజికవర్గాలతో కాంగ్రెస్ ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుపై కూడా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.
అటు సురేఖ, మురళీ సామాజికవర్గాలతో పాటు కాంగ్రెస్ ఓటు కలిసివస్తే తామే చాంపియన్గా నిలవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్గా మారింది.