హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా..
ఆర్.బి.ఎం డెస్క్ : హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కరోనా కారణంగా ఎన్నికలను సీఈసీ వాయిదా వేసింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు భావించినట్లుగానే వాయిదా పడ్డాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. నియోజకవర్గంలో ఉన్న స్థానిక పరిస్థితులు తెలపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. అలాగే కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.