విజయసాయికి ఆర్థికశాఖ?

విజయసాయికి ఆర్థికశాఖ?

ఆర్.బి.ఎం: ఏపీలో జూన్ నెలలో కేబినెట్‌ను సీఎం జగన్ విస్తరిస్తాంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ నెలకొంది. కొత్తదంటే కొత్త ట్విస్ట్ కాదు. గతంలో జగన్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడే వచ్చే రెండున్నర ఏళ్లలో కేబినెట్‌ను విస్తరిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా త్వరలో కేబినెట్‌ను విస్తరిస్తామని మంత్రులతో జగన్ అన్నారు. ఇక అప్పటి నుంచి ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు శక్తిమించి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 90 శాతం కేబినెట్‌లో మార్పులుంటాయని చెబుతున్నారు. దీంతో వివాదాల్లో చిక్కుకున్న మంత్రులు ఆందోళనలో.. ఆశావాహులు ప్రయత్నాల్లో మునిగిపోయారు.

కేబినెట్‌ను విస్తరిస్తే ఎవరెవరీ మంత్రి పదవులు వరిస్తాయనే చర్చ కూడా నడుస్తోంది. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, హోంశాఖలపైనే చర్చ జరుగుతోంది. ఈ సారి ఆర్ధిక శాఖను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖను బుగ్గన రాజేంద్రనాథ్ నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థికశాఖపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయసాయి పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే విజయసాయి గతంలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలపై విజయసాయికి గట్టిపట్టు ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.

రాష్ట్రంలో పాలనను గాడిలో పట్టాలంటే కేంద్రమంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించాలి. ఇప్పటికే ఎంపీగా ఢిల్లీ వ్యవహారాలు విజయసాయికి సుపరిచితమేనని, అందువల్ల ఆర్థికశాఖను విజయసాయికి అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీగా ఎన్నుకుని ఆర్థికశాఖను విజయసాయికి కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *