రవితేజ,సల్మాన్ఖాన్, అల్లు శిరీష్,సాయి ధరమ్తేజ్ రకుల్పై మరోకేసు ..
ఆర్,బి.ఎం హైదరాబాద్: దేశవ్యాప్తంగా దిశ హత్యాచారం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల ఎన్కౌంటర్ కూడా అప్పట్లో ప్రకంపనలు రేపింది. ఎన్కౌంటర్పై విచారణ కూడా జరుగుతోంది. అయితే దిశకు మద్దతుగా దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో దిశకు మద్దతుగా అనేక మంది పోస్టులు పెట్టారు. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులు, హీరోలున్నారు. అప్పుడు సోషల్ మీడియాతో వీరు పెట్టిన పోస్టులపై కేసు నమోదు చేశారు. ఎందుకంటే దిశ హత్యాచారం కేసులో బాధితురాలి పేరును వెల్లడించారంటూ 40 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. సినీప్రముఖులు దిశ పేరును వెళ్లడించారంటూ గౌరవ్ అనే న్యాయవాది ఢిల్లీలోని సబ్జిమండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో 40 మందిపై ఐపీసీలోని సెక్షన్ 228ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారెంట్ జారీ చేశారు.
ఈ కేసులో నిందితుల జాబితా
సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్, అభిషేక్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ఖేర్, అర్మాన్ మాలిక్, కరీంవీర్ వోహ్రా, రవితేజ, అల్లు శిరీష్, జరీన్ ఖాన్, యామి గౌతమ్, రిచా చద్దా, కాజల్ అగర్వాల్, సాయి ధరమ్తేజ్, పరిణీత చోప్రా, దియా మిర్జా, స్వర భాస్కర్, రకుల్ ప్రీత్సింగ్, షబానా అజ్మీ, హన్సిక మోత్వాని, దివ్యాంశ్ కౌశిక్, మోడల్ లావణ్య, ప్రియా మాలిక్, మెహ్రీన్ పిర్జాదా, నిధి అగర్వాల్, ఛార్మీ కౌర్, అశిక రంగనాథ్, కీర్తి సురేష్, ఫిల్మ్ మేకర్ అలంకిత శ్రీవాస్తవ, బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్, గాయని సోనా మహాపాత్ర, టాలివుడ్ దర్శకుడు సందీప్రెడ్డి, క్రికెటర్ హర్భజన్ సింగ్ తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ట్విటర్లో బాధితురాలి పేరును, ఫొటోను పోస్టు చేశారని గౌరవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.