దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారణ… సజ్జనార్కు సమన్లు జారీ
ఆర్.బి.ఎం హైదరాబాద్: దేశవ్యాప్తంగా దిశ హత్యాచారం కలకలం రేపింది. దిశ నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా దిశ కేసులో నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్పై పౌరహక్కుల సంఘాలు ఖండించాయి. దిశ నిందితులన పట్టుకుని కాల్చిచంపారని హక్కుల సంఘాలు ఆరోపించాయి. ఈ ఎన్కౌంటర్పై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్పై సిర్పుర్కర్ కమిషన్ విచారణ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ప్రశ్నించింది. మృతుల కుటుంబ సభ్యులు నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. ఎన్కౌంటర్లో మరణించిన నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ ఐపీఎస్ అధికారి సజ్జనార్కు సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్ను విచారించే అవకాశం ఉంది. కాగా సోమవారం త్రిసభ్య కమిటీ ముందు ఎన్హెచ్ఆర్సీ బృందం హాజరుకానుంది. సజ్జనార్ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్ చీఫ్ మహేశ్ భగవత్ను విచారించనుంది.