గురువుని అత్యున్నత పీఠం పై నిలిపిన భారతీయ సమాజం

గురువుని అత్యున్నత పీఠం పై నిలిపిన భారతీయ సమాజం

ఆర్.బి.ఎం  హైదరాబాద్: సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయరీతి చాలా ఇతర నాగరికతలకు భిన్నంగా కనిపిస్తూ అనేక ప్రత్యేక కోణాల్లో వ్యక్తమౌతూ ఉంటుంది. అది మన వారసత్వపు మూలాల్లోకి చొచ్చుకుపోయిన లోతైన ఆలోచనా రీతిని ఆవిష్కరిస్తుంది.

గురుశిష్య సంబంధం అనేది మన జీవితాల్లో అటువంటి ఒక అంశం. మన సాంప్రదాయక విలువల్లో విధిగా అది ఒక భాగం. మన భారతీయ సమాజం గురువుని అత్యున్నత పీఠం పై నిలిపింది. ఎందుకంటే గురువుతో సమానులు లేరు. సంత్ కబీర్ చెప్పినట్టు “గురువు గొప్పదనం మాటలకందనిది, అలాగే శిష్యుడైనవాడిదే గొప్ప అదృష్టం…”

అలాగే పరమహంస యోగానంద శిష్యురాలూ, యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) కి పూర్వ అధ్యక్షురాలూ అయిన మృణాళినీ మాత తాను రచించిన “గురుశిష్య సంబంధం” అనే పుస్తకంలో శిష్యుడి జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలరన్న సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించారు. శిష్యుడిని అన్ని విధాలా తనకు ప్రతిరూపంగా తయారుచేయడానికి కావలసిన శక్తి, సహజమైన సామర్థ్యం గురువు కలిగి ఉంటారు.

నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం తేలికే. అయితే యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని సలహా ఇచ్చారు: “జీవితమనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ వెళ్తున్నపుడు, కళ్ళున్నవారి సహాయం నీకు కావాలి… ఆ మార్గం సత్యమైనదా, కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నారు, ఆయన చేసే పనులు తాను భగవంతుని చేత నడపబడుతున్నట్టు ఉన్నాయా, లేక తన స్వంత అహంతో నడపబడుతున్నట్టు ఉన్నాయా అని విచక్షణతో తెలుసుకోండి. ఆత్మసాక్షాత్కారం పొందని గురువుకు ఎంత పెద్ద శిష్య బృందం ఉన్నా అతడు మీకు దైవ సామ్రాజ్యాన్ని చూపలేరు.”

మరణం లేని గురువుగా, శతాబ్దాలుగా హిమాలయాల్లో జీవించి ఉన్న మహావతార బాబాజీ తన గొప్ప శిష్యులలో ఒకరైన లాహిరీ మహాశయులకు 1861 లో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన క్రియాయోగంలో దీక్ష ఇచ్చారు. ఆ తరువాత ఆయన శిష్యులైన శ్రీయుక్తేశ్వర్ గిరి వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలను స్థాపించి ఈ శాస్త్రీయ మార్గంలోకి వేలాదిమందిని తీసుకువచ్చిన పరమహంస యోగానందకి శిక్షణ నిచ్చి ఆయనను సిద్ధం చేసే బాధ్యత స్వీకరించారు. నేడు వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. 175 దేశాల్లోకి వ్యాపించింది . వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. అలుపెరగని ప్రయత్నాలతో క్రియాయోగం యొక్క ఆశీస్సు ఈరోజు మరింతగా వర్ధిల్లుతోంది.

ప్రపంచవ్యాప్తంగా జీవితాల్ని మార్చగల ఉజ్జ్వల ఆధ్యాత్మిక కావ్యంగా ప్రఖ్యాతి పొందిన తన “ఒక యోగి ఆత్మకథ” లో గురుశిష్య సంబంధాన్ని గురించి యోగానంద ఎంతో ప్రేమతోనూ ఓర్పుతోనూ అత్యంత వివరంగా వివరించారు.

ఎంతో జాగ్రత్తతోనూ సూక్ష్మదృష్టితోనూ శ్రీయుక్తేశ్వర్ ఇచ్చిన శిక్షణతో యోగానంద భగవంతుడితోనూ గురువుతోనూ అనుసంధానంలో ఉండడం ఎలాగో చూపించిన ఒక నిజమైన దృష్టాంతంగా రూపుదిద్దుకొన్నారు. ఇక యోగానంద తన వంతుగా యోగధ్యానం, సమతుల జీవనాన్ని బోధించే తన సార్వత్రిక బోధనల ద్వారా తన జీవిత కాలంలో వేలకొద్దీ శిష్యులకు, అనంతరం లక్షలాది మందికి ఆధ్యాత్మిక నేస్తంగా, మార్గదర్శకునిగా, తత్వవేత్తగా తోడ్పాటు నందించారు.

‘జగద్గురువు’గా గుర్తింపు పొందిన యోగానంద పతంజలి మహాశయుడు బోధించిన అష్టాంగయోగ మార్గంపై ఆధారపడిన తన ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని విశ్వాసంతో, స్థిరంగా అభ్యసించడం అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రతి వ్యక్తీ ఒక ఆత్మ అనీ అంతర్గతంగా అది పరమాత్మతో తన ఏకత్వాన్ని పునఃస్థాపించుకోవడానికి తపిస్తుంటుందనీ యోగానంద అర్థమయ్యేలా చెప్పారు. సత్యాన్వేషకులందరూ లోతుగా అర్థం చేసుకోవడం కోసం ధార్మిక గ్రంథాలైన “భగవద్గీత” మరియు “బైబిల్ “లకు ఆయన వ్యాఖ్యానాలు వ్రాశారు. ఆయన యొక్క ఇతర ప్రచురణలు, మరీ ముఖ్యంగా “జీవించడం ఎలాగో నేర్పే గృహాధ్యయన పాఠాలు” ఆయన బోధలకు అమూల్యమైన ప్రతినిధులు.

భారతదేశపు గొప్ప గురువులకు మనం అందించగల అత్యంత మధురమైన నివాళి గురుపూర్ణిమ. గురువు ఆదర్శాలకు ఈ ముఖ్యమైన రోజున పునరంకితం కావడం ద్వారా చిత్తశుద్ధి గల శిష్యుడు ఆత్మసాక్షాత్కార నిచ్చెనపై తరువాతి మెట్టును ఎక్కుతాడు. మరింత సమాచారం కోసం: yssi.org

Leave a Reply

Your email address will not be published.