అమెరికా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. డీఆర్‌ఐ అధికారులు మూడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 5.3 కిలోల హైడ్రోపోనిక్‌ వీడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.2.36 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అమెరికా నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా ఇక్కడికి డ్రగ్స్‌ తరలిస్తున్నారని అందిన సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ అధికారులు సమన్వయంతో మూడుచోట్లా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ముంబైలోని అంతర్జాతీయ పార్శిళ్లు చేరే పోస్టాఫీస్‌లో దాడులు చేశారు. ఈ దాడిలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వెంటనే హైదరాబాద్‌ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ ఓ పార్శిల్‌లో 1.8 కేజీల హైడ్రోపోనిక్‌ వీడ్‌ సీజ్‌ చేశారు. మొత్తం 5.3 కేజీల వీడ్‌ డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.