అవమానాలు భరించలేకనే రాజీనామా: జగ్గారెడ్డి
ఆర్.బి.ఎం హైదరాబాద్: కాంగ్రెస్లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి.. ప్రజల్లోకి స్వతంత్రంగా వెళ్లి సేవ చేస్తానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాశారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని లేఖలో తెలిపారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్లో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేదని.. ఇప్పుడు ఈ పరిస్థితులు లేవని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని లేఖలో జగ్గారెడ్డి కోరారు.