వణికిస్తున్న ‘గులాబ్’..హైదరాబాద్లో హై అలర్ట్
ఆర్.బి.ఎం హైదరాబాద్: ‘గులాబ్’ తుఫాను తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం ఉత్తరాంధ్రపై చూపుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కళింగపట్నానికి 50 కి.మీ దూరంలో, గోపాల్పూర్కు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. సోమవారం ఉత్తరకోస్తాలో భారీ భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కొంపెల్లి, కుత్బుల్లాపూర్, అంబర్ పేట్, కాచిగూడ, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాజీగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్లో ప్రాంతాల్లో వర్షం పడింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.