కేసీఆర్ను ఇరుకున పెడుతున్న షర్మిల
ఆర్.బి.ఎం హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. ఆమె సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు యువత సమస్యలపై ఉద్యమించారు. ఇక నుంచి ఆమె తన కార్యచరణను విసృతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ను షర్మిల ఇరుకున పెట్టబోతున్నారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షలు కాదు 50లక్షలు ఇవ్వాలనే కొత్త డిమాండ్ తో ఆందోళన బాట పట్టబోతున్నారు. కేసీఆర్ సర్కార్ లో దళితులకు ఒరిగింది ఏమి లేదని తప్పుబడుతున్నారు. కేసీఆర్ నిర్లక్ష్యాలను ఎండగడతానంటూ నేడు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా ఛలో తిరుమల గిరి పేరుతో దళిత భేరిని నిర్వహించనున్నారు.
20వేలమంది జనసమీకరణ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దళితమేదావులు, దళిత నేతలకు ఈ సభకు షర్మిల ఆహ్వానించారు. దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేకుంటే వాటి ఖరీదు చేసే మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నారు. 7 ఏళ్ల పరిపాలనలో దళితులకు జరిగిన అన్యాయం ప్రధానంగా సభ ప్రస్తావించబోతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తెచ్చారనే అంశాన్ని ఎండగడుతూనే గతంలో కేసీఆర్ చేసిన దళితులకు మూడెకరాల భూమి హామీ, దళిత సీఎం వంటి వాగ్దానాలు ఏమైయ్యంటూ షర్మిల ప్రశ్నించబోతున్నారు.