కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. పద్మవ్యూహంలో చిక్కుకున్న ఈటల
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ పద్మవ్యూహంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చిక్కుకున్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ను వ్యూహాత్మకంగా ఒంటరిని చేస్తున్నారు. ఈటల టీఆర్ఎస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరినప్పుడు తనవెంట అనుయాయులను కూడా తీసుకెళ్లారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. టీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ రెండు నెలల్లో ఈటలను వీడి మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. ప్రజాబలం, ప్రజల సానుభూతి తనకే ఉందని ఈటల భావిస్తున్నారు. ఆ సానుభూతి ఓటుగా మారి తనకు విజయాన్ని అందిస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈటల ఆశలను టీఆర్ఎస్ మొగ్గలోనే తుంచేస్తోంది. ఈటల బలాన్ని తగ్గించేందుకు టీఆర్ఎస్ భారీ స్కెచ్ వేస్తోంది.
నవంబరు వరకు ఎన్నికలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో టీఆర్ఎస్ రోజురోజుకూ ప్రచారంలో వేగాన్ని పెంచింది. ప్రగతిభవన్ కేంద్రంగా కేసీఆర్ వేస్తున్న స్కెచ్లు, క్షేత్రస్థాయిలో మంత్రి హరీశ్రావు అమలు చేస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేవని తేలినా మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తమ పర్యటనలను యథావిధిగా కొనసాగిస్తూ పట్టును పెంచుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రచారంలో పుంజుకుంటోంది. దాంతో ఆ పార్టీ గ్రాఫ్ నియోజకవర్గంతో పెరుగుతూ వస్తోంది. టీఆర్ఎస్ వేగాన్ని బీజేపీ అందుకోలేక పోతోంది. కేసీఆర్ రచిస్తున్న పద్యవ్యూహంలో ఈటల రాజేందర్ అభిమన్యుడు అవుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.