కరీంనగర్: ప్రజా ప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను తల్లి విజయమ్మ హుజూరాబాద్ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరంలో శుక్రవారం రాత్రి కలిశారు. పాదయాత్ర తీరు తెన్నులు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శుక్రవారం షర్మిల పాదయాత్ర కరీంనగర్ జిల్లా సైదాపూర్, హుజూరాబాద్ మండలాలలో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి దొంగ హామీలు ఇచ్చి గాడిదకు రంగు పూసి అదే ఆవు అని నమ్మించినట్లు కేసీఆర్ ప్రజలకు మాయ మాటలు చెపుతాడు. గెలిచిన తరువాత ఫామ్హౌస్లో పడుకొని, ప్రజల సమస్యలు పట్టించుకోడని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తునక రాష్ట్రమని చెప్పి అప్పుల కుప్ప చేశారన్నారు. బంగారు తెలంగాణ మాత్రం కేసీఆర్ కుటుంబానికే అయ్యిందన్నారు. గుడులు బడుల కన్న బార్లు, బీర్ల దుకాణాలే ఎక్కువయ్యాయని, ఇది బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ అని తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో ఒక్క నియోజకవర్గం కూడా బాగు పడలేదని షర్మిల మండిపడ్డారు.