వివేకానంద బోధనలతో ఆత్మవిశ్వాసం: స్వామి బోధమయానంద
స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో మైలురాయి: గవర్నర్ జష్ణు దేవ్ వర్మ….
హైదరాబాద్, ఫిబ్రవరి 13: స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో, రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ కాలేజ్ లో వివేకానంద దివస్ సందర్భంగా మెహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం సంయుక్తంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్ లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికా చికాగోలో జరిగిన విశ్వ మత సభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమని గవర్నర్ చెప్పారు. చికాగో ప్రసంగంలో వేదాలు, పురాణాలు, అనుష్టాన వేదాంతం గురించి స్వామి వివేకానంద చెప్పారని వర్మ తెలిపారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత భారత్ ను విశ్వ గురువుగా చేయగలరని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. యువత.. స్వామి వివేకానంద సైనికులుగా మరి దేశాన్ని ప్రేమిస్తూ ఆయన కలలను సాకారం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామిబోధమయానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వామి వివేకానంద బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత నిర్భయత్వం, త్యాగగుణం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్ ను విశ్వగురువు చేయాలన్న స్వామి వివేకానంద కలలను యువత సాకారం చేయాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ కు వివేకానంద పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైనిక్ పురి భవన్స్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మెహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, రామకృష్ణ మఠం స్వాములు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

