9వ జాతీయ పికిల్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ హవా
జమ్మూ సిటీ / హైదరాబాద్, సెప్టెంబర్ 28, 2025 – ఆల్ ఇండియా పికిల్బాల్ అసోసియేషన్ (AIPA) ఆధ్వర్యంలో జమ్మూ, జమ్మూ & కాశ్మీర్లో సెప్టెంబర్ 26–28, 2025 తేదీల్లో నిర్వహించిన 9వ జాతీయ పికిల్బాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ జట్టు అద్భుత విజయాలను సాధించింది.
ఈ జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అమెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్( ATPA )సెప్టెంబర్ 13–14న రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించి, ప్రతిభావంతులైన క్రీడాకారులచే, తెలంగాణ టీమును ఎంపిక చేసింది.
తెలంగాణకు బంగారు, కాంస్య పతకాలు
ఈ ఛాంపియన్షిప్లో 35+ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని ATPA ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుచరితా ఠాకూర్ మరియు జట్టు కోచ్ శ్రీ పి. చక్రపాణి గెలుచుకున్నారు. అదేవిధంగా:డా. సోనిబాలా దేవి (VC & MD SATG) 50+ మహిళల సింగిల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఆమె విజయం అన్ని వయస్సుల ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.
అభినందనలు
జాతీయ స్థాయిలో తెలంగాణ గర్వకారణమైన ఈ విజయాన్ని సాధించినందుకు తెలంగాణ క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
చైర్మన్ శివసేనారెడ్డిలు పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు గెలవడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ విజయాలు పికిల్బాల్ క్రీడ ప్రాచుర్యాన్ని మాత్రమే కాకుండా, మన రాష్ట్రంలోని ప్రతిభా స్థాయిని కూడా చాటుతున్నాయని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలు అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, ఉద్యోగరీత్యా క్రీడాభివృద్ధికి కృషి చేయడమే కాకుండా స్వయంగా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయం అని వారు అన్నారు
తెలంగాణలో పికిల్ బాల్ ను ప్రోత్సహిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా పికిల్బాల్ క్రీడను ప్రోత్సహించి, భవిష్యత్ చాంపియన్లను తీర్చిదిద్దడంలో మరియు తెలంగాణకు జాతీయ క్రీడా పటంలో మరింత ప్రాధాన్యం కల్పించడంలో ATPA కట్టుబడి ఉందని అధ్యక్ష కార్యదర్శులు రమేష్ జగన్మోహన్ లు ప్రకటించారు. హైదరాబాద్ నగరం మే కాదు తెలంగాణలో క్రమక్రమంగా విస్తరిస్తున్న పికిల్ బాల్ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వము వివిధ క్రీడా సంస్థలు సహకరించాలని వారు కోరారు
