భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం (గీతాజయంతి ప్రత్యేకం)

భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
(గీతాజయంతి ప్రత్యేకం)

భారత దేశంలోని పిల్లలు తాము ఎదిగే క్రమంలో వినే కథలన్నిటిలో, తరతరాలుగా, వారిని ఎక్కువగా మహాభారత కథ ఆకట్టుకుంటున్నది. అయినా, మహాభారత కథ పుటలలో మనకు దర్శనమిచ్చే వివిధ పన్నాగాలు, ప్రతి పన్నాగాలు పాత్రలు, ప్రతినాయకులతో కూడిన సంక్లిష్టతల మధ్య ఈ గ్రంథసారం మనకు భగవద్గీతా సందేశంలో అగుపిస్తుంది. కాలాతీతమై, యుగయుగాలకూ చెంది ,శాశ్వతత్వాన్ని కలిగి ఉన్న ఈ దివ్యప్రబోధాన్ని పరమాత్ముడే స్వయంగా తన శిష్యుడూ, మహా వీరుడైన పాండవ యోధుడు అర్జునుడికి ఉపదేశించాడు. అది అలౌకికగీతమైన భగవద్గీత రూపంలో అద్భుతకావ్యంగా వెలువడింది.

ఆధ్యాత్మికమార్గంలో ప్రయాణిస్తున్న భక్తుడు ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రయాణంలోని ఆ భాగంమీద భగవద్గీత కాంతి ప్రసరింపచేస్తుందన్నది సత్యోక్తి.

గీతాజయంతిని ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు నెలలో జరుపుకుంటారు. పండితులు ఈ గ్రంథంలోని సూక్ష్మగ్రాహ్యవిషయాలను, ముఖ్యంగా ఈసమయంలో, విశదీకరిస్తారు.

కురుక్షేత్ర రణరంగంలో తన స్వంత “బంధుజనులతో” పోరాడడానికి నిరాకరిస్తూ నిరాశాపూరితుడై ఉన్న అర్జునుడికి జవాబుగా కృష్ణభగవానుడు తన పరిణామాత్మక, ఉత్తేజపూరిత వాక్కులతో అంతిమసత్యాన్ని ఉపదేశించాడు. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు రచించిన “గాడ్ టాక్స్ విత్ అర్జున“ అనే గ్రంథం భగవద్గీతకు దానిలోని అంతర్గత సందేశానికి లోతైన ఆధ్యాత్మిక వివరణ. యోగానందగారు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే ‘ఒక యోగి ఆత్మకథ ‘ (Autobiography of a Yogi) ను మరియు ఇంకా ఎన్నో ప్రేరణాత్మక ఆధ్యాత్మికగ్రంథాలను కూడా రచించారు.

“గాడ్ టాక్స్ విత్ అర్జున“ యొక్క రెండు సంపుటాల్లోనూ యోగానందగారు భగవద్గీతలోని 700 శ్లోకాల అసలైన భావాన్ని ఎంతో వివరంగా విశ్లేషించారు. కృష్ణభగవానుడు అర్జునునికి చేసిన ఆ దివ్యోపదేశం సారం ఏమిటంటే మనలోని ప్రతి ఒక్కరూ ఈ శరీరం కాదు, ఒక ఆత్మ. అలాగే ఆత్మ జీవన్మరణాల అనంత చక్రభ్రమణం నుండి విముక్తి పొందడానికి వీలుగా, మనలోని పాండవులు మనలోని కౌరవులపై ఎప్పటికైనా విజయం సాధించి తీరాలి.

భగవానుడు తనశిష్యుడైన అర్జునుడిని సర్వోత్కృష్టమైన యుద్ధం చేయమని ప్రోత్సహించినట్టే, ప్రతి మానవుడు అంతిమ విముక్తి సాధించడానికి తనలోని అహంకారాన్ని, అలవాట్లను, కోపాన్ని, దుష్టత్వాన్ని, దురాశను, భౌతికవాంఛలను జయించడానికి పాటుపడాలి. యోగానందగారు వివరించినట్టుగా మహాభారతంలోని ప్రతీ పాత్రా అది మనలోని ఉత్తములైన పాండవులకు ప్రతినిధా లేక కౌరవులకా అన్న దాన్ని బట్టి మనం పెంపొందించుకోదగిన లేక వదిలించుకోవలసిన ప్రత్యేక లక్షణానికి తార్కాణంగా నిలుస్తుంది.

యోగానందగారు బోధించిన “క్రియాయోగ” బోధలు భగవద్గీతాసారం చుట్టూ పరిభ్రమిస్తాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన యోగానందగారి గృహ అధ్యయన పాఠాలు ఆత్మసాక్షాత్కారానికి అత్యున్నతమార్గమైన క్రియాయోగ ధ్యానప్రక్రియలగురించి దశలవారీ సూచనలను అందిస్తాయి. సత్యాన్వేషకులందరికీ ఈ వై.ఎస్.ఎస్. పాఠాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే అవి లక్షలాది భక్తులకు తమలోని ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవదానికి తోడ్పడ్డాయి.

భగవద్గీతలో ఈ ఉత్కృష్ట శాస్త్రీయధ్యానప్రక్రియ అయిన ‘క్రియాయోగం‘ రెండుసార్లు ప్రస్తావించబడింది. 19వ శతాబ్దంలో మహావతార బాబాజీ గారు తనశిష్యుడు, యోగానందగారి పరమగురువు అయిన లాహిరీ మహాశయులకు ఈ జ్ఞానాన్ని అందించడానికి ప్రదర్శించిన లీల ద్వారా మానవజాతి ఈ ప్రక్రియను తిరిగి కనుగొనగలిగింది. లాహిరీ మహాశయుల ద్వారా “క్రియాయోగం”లో దీక్ష పొందిన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు తన ప్రధానశిష్యులైన యోగానందగారికి దానిని ఉపదేశించారు.

భారతదేశంలో ఒక నానుడి ఉంది, “ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.” గీతాబోధలను అనుసరించడానికి తమ జీవితాలను సంసిద్ధపరచిన వారు భాగ్యశాలురు. మరింత సమాచారం కొరకు మా వెబ్ సైట్ yssi.org ను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *